అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు.
అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.
వాట్సాప్ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లర్లకు సంబంధించి ఆందోళనకారుల వాట్సప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అవ్వగా, పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరో వైపు కరీంనగర్కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సుబ్బారావును విచారణ అనంతరం ఎపి పోలీసులు తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాట్సాప్ గ్రూప్ల వేదికగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసనకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే కుట్రకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. శుక్రవారం ఆందోళనలో 10 డిఫెన్స్ అకాడమీలకు చెందిన ఆందోళకారులు పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో పలువురు హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కోచింగ్ పొందారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుపుతున్న సంభాషణలు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 30 మందిలో ఇద్దరు యువకులు బోగీలకు నిప్పుపెట్టినట్లు గుర్తించారు.
కామారెడ్డి వాసి సంతోష్, ఆదిలాబాద్ వాసి పృథ్వీరాజ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఇద్దరూ పెట్రోల్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి మధుసూదన్ వాట్సాప్లో ఆడియో సందేశం పంపినట్లు బోగీలు తగలబెడితే కేంద్రం దృష్టికి వెళ్తుందని ఆడియోలో ఉన్నట్లు తేల్చారు.
ఆర్మీలో చేరాలనుకునే వారికి సుబ్బారావు మూడు నెలలు శిక్షణ ఇస్తున్నాడు. తన వద్ద శిక్షణ తీసుకునే అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాతే వారి నుంచి రూ.1,00,000 తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సుబ్బారావు వద్ద శిక్షణ తీసుకున్న 12,000మంది అభ్యర్థులు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రం అగ్నిపథ్ను ప్రకటించడంతో తన వ్యాపారానికి దెబ్బతగులుతుందని భావించాడు. దీంతో తన వద్ద శిక్షణ తీసుకుంటున్న వారితో అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాని ప్లాన్ వేశాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న 450మంది యువకులను సుబ్బారావు గుంటూరు నుంచి రైలు ద్వారా సికింద్రాబాద్కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. విధ్వంసం చేసిన వారిలో ఎక్కువ మంది నర్సారావు పేటలోని సాయి డిఫెన్స్ అకాడమికి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.