దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారం చేపట్టగల అవకాశాలు గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపింది. ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుపనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలలో బిజెపి మాత్రమే రాజకీయ ప్రత్యామ్న్యాయం అనే సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నది. మరోవంక, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి, ఆదివారం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరింప చేస్తుకున్నది.
తెలంగాణాలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే నాయకత్వం మాత్రం అంతంత మాత్రంగా ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పాదయాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉండడంలో విజయం సాధిస్తున్నా, ఆ రీతిలో పార్టీకి మద్దతును కూడదీసుకు రాగాల క్షేత్రస్థాయి నాయకత్వంను మాత్రం పెంపొందింపలేక పోతున్నట్లు భావిస్తున్నారు.
టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఈటెల రాజేందర్ కు ప్రజలను సమీకరింపగల శక్తియుక్తులు ఉన్నట్లు గుర్తించిన బిజెపి అగ్రనాయకత్వం ఆ దిశలో ఆయనకు కీలక అప్పచెప్పబోతున్నారా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతున్నది.
టి ఆర్ ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పైననే తిరుగుబాటు జరిపి, సరిగ్గా ఏడాది క్రితం బీజేపీలో చేరి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, కేసీఆర్ ఎంతగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార దుర్వినియోగం జరిపినా హుజురాబాద్ నుండి ఘనవిజయం సాధించి అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్ రాజేందర్ ఇచ్చారు.
ఈ విషయాన్నీ గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో బిజెపిని ప్రజలలోకి చొచ్చుకుపోయి విధంగా చేసి, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించే విధంగా చేయడంలో కీలక పాత్ర వహించే విధంగా రాజేందర్ సేవలను వినియోగించుకోవడం గురించి పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరినా రెండు విడత పాదయాత్రలో చెప్పుకోదగిన వారెవ్వరూ చేరలేదు. చాలామంది చేరగలరని అనుకొంటున్న వారు ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. కొంత కాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ కూడా పుంజుకొంటున్నట్లు కనబడటమే అందుకు కారణంగా భావిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులలో బిజెపి మరింత ఉధృతంగా ప్రజలలోకి వెళ్లడం ద్వారా మాత్రమే వచ్చే ఎన్నికలలో తగు ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈ దిశలో బిజెపి కేంద్ర నాయకత్వమే ఓ ప్రణాళికాయుతంగా తెలంగాణాలో పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఎన్నికలు జరిగే వరకూ కేంద్ర నాయకులే తెలంగాణలో పార్టీ వ్యాహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.