తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన సాగుతోందని, ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదనిధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారని రూపాయికి కిలో బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదని, రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోందని ఆమె విమర్శించారు.
సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా బియ్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె తెలిపారు.
ప్రభుత్వం తీరు వల్ల ప్రజలే కాదు..డీలర్లూ నష్టపోతున్నారని, రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే… 20వ తేదీ లోపు డీడీలు కట్టించుకుని, 30వ తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలని ఆమె చెప్పారు.
కానీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఇదంతా ఆలస్యమవుతోందని ఆమె తెలిపారు. కేసీఆర్.. పేదల కడుపు మీద కొట్టడం ఎంత వరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు. పేదలకు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రేషన్ బియ్యమే శరణ్యం. కానీ పేద బతుకులతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు. “కేసీఆర్… వీరి ఉసురు ఊరికే పోదు. నువ్వు, నీ సర్కార్ మట్టి కొట్టుకుపోవడం ఖాయం.’’ అని ఆమె హెచ్చరించారు.