రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించక పోవడం, అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంటూ ఆ డబ్బును వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు వ్రాసిన ఓ బహిరంగ లేఖలో ఖరీఫ్ సీజను ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాకపోవడంతో డబ్బు కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులు రైతులకు అప్పుల ఆశచూపి అధిక వడ్డీలు వసూళ్ళు చూస్తున్నారని చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ.517.16 కోట్లు ప్రభుత్వం రైతులకు బకాయి పడినట్లు సంజయ్ తెలిపారు.
రాష్ట్రప్రభుత్వ అహంకారపూరిత ప్రకటనలతో దాదాపు 14 లక్షల ఎకరాలలో యాసంగిలో రైతులు వరిపంట వేయక పోవడంతో వరి వేయని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నా మీ ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారని అంటూ ఆయన కేసీఆర్ ను నిలదీశారు.
రైతుసంక్షేమాన్ని కోరే ప్రభుత్వమని చెప్పుకొనే మీరు రైతాంగాన్ని నిలువునా దివాళ తీయిస్తున్నారని, మీ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదని మండిపడ్డారు. వానాకాలం సీజను ప్రారంభం అయినా మీ వ్యవసాయ శాఖ మంత్రి కాని, వ్యవసాయ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు గాని కనీసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడం చూస్తే వ్యవసాయరంగం, రైతులపై మీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతుందని సంజయ్ ధ్వజమెత్తారు.
యాసంగి పంట కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దు నిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలనని డిమాండ్ చేశారు. అన్నీ జిల్లాల్లో రైతుసంఘాలతో, అన్నీ రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.