రాష్ట్రపతి ఎన్నికలలో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రేపు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో నేడు ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్లో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను స్వాగతించారు. బీజేపీ సీనియర్ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు.
ఢిల్లీ చేరుకుక్నన్ ద్రౌపదీ ముర్మూకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్ , ఇతర నేతలు స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఒడిశా సదన్లో ద్రౌపదీ బస చేయనున్నారు. నామినేషన్ వేసే వరకు ముర్మూకు సహాయకారిగా కిషన్ రెడ్డి ఉండనున్నారు.
ముర్మూ నామినేషన్కు ప్రహ్లాద్ జోషి నివాసంలో ఏర్పాట్లు చేయనున్నారు. ముర్మూ నామినేషన్పై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ, యుపి సిఎంలు, కేంద్రమంత్రులు సంతకాలు చేయనున్నారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించేందుకు ఢిల్లీ రావాలంటూ ఎన్డీఏ తరఫున సీఎంలుగా కొనసాగుతున్న నేతలకు బీజేపీ ఆహ్వానం పలికింది.