ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే రాజకీయ సంక్షోభం సృష్టించారని, దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడం పట్ల బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేస్తూ శివసేన పార్టీపై ఆ పార్టీ మంత్రి ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబాటులో తమ పార్టీ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ‘ఏదోపని మీద’ మాత్రమే ఢిల్లీ వెళ్లారని, ఈ సంక్షోభంపై సంబంధం లేదని తెలిపారు. చెప్పారు.
తన స్వస్థలం కొల్హాపూర్లో మీడియాతో మాట్లాడుతూ , శివసేన, మహా వికాస్ అఘాడిలో తలెత్తిన సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. ముంబైలో గురువారం మధ్నాహం తాను దేవేంద్ర ఫడ్నవిస్తో లంచ్ చేశానని, ఆ తర్వాత ఆయన ఏదో పనిమీద ఢిల్లీ వెళ్లారని తెలిపారు. ఒకవేళ ఏదైనా పరిణామాలు అంటే ఉండే తప్పనిసరిగా చెబుతానని ఆయన తనతో అన్నారని పాటిల్ వివరించారు.
బీజేపీ ప్రస్తుతం 2024 ఎన్నికల సన్నాహాల్లో బీజేపీగా ఉందని ఆయన చెప్పారు. షిండే తిరుగుబాటులో బీజేపీ పాత్ర ఉందని పవార్ వ్యాఖ్యానించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. ముంబైకి చెందిన బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ రెబల్ నేతలతో గౌహతిలో ఉన్నారనే వార్తలపై స్పందిస్తూ, ఆయనకు ప్రతి పార్టీలోనూ మిత్రులున్నారని, ఎవరికైనా సాయం కోసం ఆయన వెళ్లి ఉండొచ్చని, ఆయన వివరాలేమీ తనకు తెలియదని పాటిల్ చెప్పారు.
ఇలా ఉండగా, ‘శక్తిమంతమైన జాతీయ పార్టీ’ మద్దతు తమకు ఉందంటూ గురువారం పరోక్షంగా బీజేపీ పేరు చెప్పిన షిండే, ఒక్క రోజైనా గడవకముందే మాటమార్చారు. జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదని శుక్రవారం స్పష్టం చేశారు. ‘శివసేన రెబల్ గ్రూపునకు బీజేపీ మద్దతు ఉందా?’ అన్న ప్రశ్నకు షిండే మాట్లాడుతూ ‘‘శక్తిమంతమైన పార్టీ మా వెనక ఉందని చెప్పిన మాట వాస్తవమే. అంటే దానర్థం బాలాసాహెబ్ థాకరే, ఆనంద్ దిఘే శక్తి మాకుందని’’ అని వివరణ ఇచ్చారు.