మహారాష్ట్రలో సొంత పార్టీ ఎమ్యెల్యేలు ఎకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ కోల్పోయిన విషయం నిర్ధారణ కావలసింది అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే గాని, రాజ్ భవన్ లలో కాదని గతంలో పలు న్యాయస్థానాలు స్పష్టం చేయడంతో బలపరీక్ష జరగడం అనివార్యంగా కనిపిస్తున్నది.
బలపరీక్షలో తమ మెజారిటీ నిరూపించు కొంటామని థాకరేతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ `మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్నప్పటికీ అందుకు తగిన బలం లేదని వారికి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కాలయాపన చేస్తే, తిరుగుబాటు ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఈ సందర్భంగా ఎమ్యెల్యేల సమావేశానికి హాజరు కాలేదని 16 మందిని అనర్హులుగా ప్రకటించాలని శివసేన డిప్యూటీ స్పీకర్ కు లేఖ అందీయడం బలపరీక్షను జాప్యం చేయడం కోసమే అని తెలుస్తున్నది. అది గమనించే షిండే తన మద్దతుదారులతో ముంబైకి వచ్చి డిప్యూటీ స్పీకర్ ను కలసి, తనను శివసేన శాసనసభ పక్ష నాయకుడిగా గుర్తించాలని కోరనున్నట్లు చెబుతున్నారు.
డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఉద్ధవ్ కు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉండగలదని ఎదురు చూస్తున్నారు. అయితే, 16 మందిని ఆయన అనర్హులుగా ప్రకటించే విషయంలో డిప్యూటీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రత్యర్థి వర్గం న్యాయస్థానంను ఆశ్రయించే అవకాశం ఉంది. కోర్టులో ఈ విషయం తేలేవరకు బలపరీక్ష జరిగే అవకాశం ఉండదు.
వారిని అనర్హులుగా ప్రకటిస్తే, అసెంబ్లీలో థాకరే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గే అవకాశం ఉంటుంది. కానీ డిప్యూటీ స్పీకర్ అటువంటి నిర్ణయం ప్రకటిస్తే షిండే వర్గం హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఒక వేల శివసేన అభ్యర్ధనను డిప్యూటీ స్పీకర్ కొట్టిపారవేస్తే, శివసేన కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
షిండే శిబిరంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 చేరువయింది. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని షిండే ప్రకటన చేశారు. ఏక్ నాథ్ షిండే శిబిరంలోకి మరో ముగ్గురు శివసేన శాసన సభ్యులు చేరుకోవడంతో ప్రస్తుతం 39 మంది శివసేన ఎమ్మెల్యేలు షిండేకు మద్దతు తెలిపారు. శాసనసభా పక్ష హోదా కల్పించాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్, గవర్నర్, శాసనమండలి సెక్రెటరీకి షిండే లేఖ రాశారు.
37 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్లకు పంపారు. శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలేను పార్టీ చీఫ్ విప్ గా సునీల్ ప్రభు స్థానంలో నియమిస్తున్నట్లు ఆ లేఖలో షిండే పేర్కొన్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం 1 గంటకు శివసేన జాతీయ కార్యవర్గ సమావేశానికి థాకరే పిలుపిచ్చారు