నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఒకప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడమే కాదు, కనీసం ఇద్దరు ప్రధాన మంత్రుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజకీయంగా ఒంటరిగా కనిపిస్తున్నారు. రాజకీయంగా ఆయనతో జత కట్టడానికి జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఆసక్తి కనబరచడం లేదు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలం నుండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనతో పొత్తుకోసం ఒకవంక వామపక్షాలు, మరోవంక బిజెపి పోటీ పడుతూ ఉండెడివి. చివరకు ఆయనతో విభేదించి, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి టి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న కె చంద్రశేఖరరావు సహితం 2009లో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీతో పొడగిట్టని రెండు వామపక్షాలు సహితం అదే సమయంలో టిడిపితో కలసి పోటీ చేశాయి.
2014 ఎన్నికలలో బిజెపితో కలసి పోటీచేసిన చంద్రబాబు అధికారంలోకి రావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో బిజెపితో కలసి మంత్రి పదవులు పంచుకున్నారు. అటువంటిది 2019 నుండి ఆయనతో పొత్తుకు ఏ పార్టీ కూడా ఆసక్తి కనబరచడం లేదు. గతంలో బిజెపితో పొత్తు ఏకపక్షంగా తెంచుకొని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చేతులు కలిపిన ఆయన పట్ల జాతీయ స్థాయిలో సహితం ఇతర ప్రతిపక్ష నేతలలో అవిశ్వాసం నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలలో వైసిపి మద్దతు కోసం ఒకవంక ప్రతిపక్షాలు, మరోవంక బిజెపి ప్రయత్నం చేశాయి. చివరకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అంతకు ముందు ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశంపై సహితం జగన్ మోహన్ రెడ్డికి ఆమె ఆహ్వానం పంపించారు.
అయితే చంద్రబాబు నాయుడును ఆ సమావేశంకు ఆహ్వానించలేదు. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అటు ప్రతిపక్షాలు గాని, ఇటు బీజేపీ గాని ఇప్పటి వరకు లాంఛనంగా అడిగినట్టు కూడా తెలియడం లేదు. 2019లో అధికారం కోల్పోయినప్పటి నుండి బిజెపికి తిరిగి దగ్గర కావాలని చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ నుండి సానుకూల సంకేతాలు రావడం లేదు.
మరోవంక, వైసిపి ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు నెలకొన్నట్లు స్పష్టం అవుతుంది. కీలక అంశాలపై పార్లమెంట్ లో బిజెపికి మద్దతు ఇస్తూ రావడం కూడా అందుకు ఓ ప్రధాన కారణం కావచ్చు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు సమయంలో వైసిపి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
మరోవంక, రాష్ట్ర స్థాయిలో వైసిపి వ్యతిరేక ఓట్లలో చీలిక నివారించడం కోసం జనసేన, బీజేపీలతో పొత్తు కోసం సానుకూల సంకేతాలు పంపినప్పటికీ ఆయా పార్టీల నుండి తగు స్పందన కనిపించడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్లో సానుకూలత వ్యక్తం చేసినా, రాను రాను దూరంగా జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.