ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కక్షసాధింపు చర్యలలో భాగం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగంగా జారీ చేసిన ఆదేశాలుగానే స్పష్టం చేస్తూ, వినాశకాలే విపరీత బుద్ది అనే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయకులను వేధించడమే లక్ష్యంగా పిచ్చి తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఒక వంక, 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం అని సంజయ్ విమర్శించారు.
టీఆర్ఎస్ నియంత–కుటుంబ–అవినీతి-దుర్మార్గపు పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను టీచర్లు ప్రశ్నిస్తుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవోను వ్యతిరేకిస్తూ సర్కార్ ను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అడ్డదారిలో అక్రమంగా బదిలీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కార్ తప్పులను ఎండగడుతుంటే ఆగమాగమైతున్నారని తెలిపారు.
అంతేకాకుండా, కేసీఆర్ తుగ్లక్ పాలనతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెబుతూ వారిని చైతన్యం చేస్తున్నారనే భయం పట్టకున్నట్లుందని సంజయ్ ఆరోపించారు. టీచర్లుసహా విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వేధించి కక్ష తీర్చుకోవడానికి ఈ జీవోను వాడుకుంటున్నట్లు కన్పిస్తోందని తెలిపారు.
ఇన్నేళ్ళుగా లేనిది కేసీఆర్ కు ఇప్పుడే ఈ జిఓ ఎందుకు గుర్తుకు వచ్చింది? కేసీఆర్ సీఎం కాకముందు… ఆయన కుటుంబం ఆస్తులెన్ని? ఆ తర్వాత కూడగట్టిన ఆస్తులెన్ని? వాటి వివరాలను ఎందుకు ఏటా విడుదల చేయడం లేదు? అంటూ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇకపై సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులంతా ప్రతి ఏటా ఆస్తుల వివరాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్తుల వివరాలంటే డమ్మీ వివరాలు చెప్పడం కాదని అంటూ సింగపూర్, మలేసియా, దుబాయిలో సీఎం, ఆయన కుటుంబం దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలన్నీ బయట పెట్టే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు. అట్లాగే కేసీఆర్ కేబినెట్ లోని మంత్రుల ఆస్తులతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను కూడా ఏటా బయటపెట్టాలని స్పష్టం చేశారు.