భారత పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో ప్రజా ప్రతినిధుల సాధారణ గణాంకాలను పరిగణలోకి తీసుకొంటె జులై చివరి వారంలో భారత రాష్ట్రపతిగా తొలిసారిగా ఓ గిరిజన మహిళ ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు చేబట్టపోతున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో రాష్ట్రపతి పదవి అధిష్టిస్తున్నవారిలో కూడా ఆమె మొదటి వారు కావడం గమనార్హం.
ఓ మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి, ప్రభుత్వంలో గ్రూప్-3 ఉద్యోగంతో ప్రారంభించి, ఉపాధ్యాయురాలుగా మారిన సాధారణ గిరిజన కుటుంబ మహిళ రాజకీయ వేత్త అయిన ఆమె జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా గెలుపొందడం లాంఛనమే కాగలదు.
స్వాతంత్ర్య కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశం మొత్తం 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అత్యంత వెనుకబడిన సంతాలీ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడమే ఓ చారిత్రాత్మక మలుపు కాగలదు. భారతదేశంలోని 12 కోట్ల మంది గిరిజనుల సాధికారికతకు సంబంధించి కీలకమైన మలుపు కాగలదు.
గిరిజనులు ఘనమైన భారత దేశపు సంప్రదాయంలో అంతర్భాగం, గౌరవనీయమైన సంస్కృతికి వారసులు. అయినప్పటికీ, అనేక శతాబ్దాలుగా నిర్లక్ష్యంకు గురయ విస్మరింపబడుతున్నారు. ఇంకా దేశంలో ఒక్కరు కూడా నెలవారీ జీతం వచ్చే ఉద్యోగం చేయని గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అనేక గిరిజన గ్రామాలు కనీస రవాణా, విద్య, వైద్య సదుపాయాలకు నోచుకోవడం లేదు. ఇంకా పలు రకాల వివక్షలకు, అన్యాయాలకు గురవుతున్నారు.
గిరిజనుల రక్షణకు, వారి సాంస్కృతిక వికాసం కోసం, వారికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలను అమలు పరుస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఇంకా ఆధునిక నాగరికతకు దూరంగా కోట్లాది మంది గిరిజనులు జీవనం కొనసాగిస్తూ ఉండడం మనందరికీ అవమానకరమే. అటువంటి సమయంలో ముర్మును ఈ పదవికి ఎంపిక చేయడం ఎంతో ముదావహం.
అధికారంలో ఉన్న బిజెపిలో రాష్ట్రపతి పదవికి అనేకమంది సమర్థులైన నేతలు ఉన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు ఉన్నారు. బిజెపి ప్రభుత్వం ఒక వంక నూపుర్ శర్మ ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం, అగ్నిపథ్ ఎంపికల అంశంపై చెలరేగిన నిరసనలు వంటి అనేక సమస్యలతో తలమునకలై ఉంది.
ఇటువంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి గురించి ఎటువంటి హడావుడి లేకున్నా రాష్ట్రపతి భవన్లో దళితుడి స్థానంలో ముర్ము (ఒక సంతాల్)ని నిశ్శబ్దంగా ఎంచుకుంది. ముర్ము జీవితం అంత అనేక సంఘర్షణాల్తో సాగింది. ఓ పేదకుటుంభం నుండి వచ్చిన ఆమె అన్ని అసమానతలను ఎదిరించి భువనేశ్వర్ రమాదేవి ఉమెన్స్ కాలేజీలో తన చదువును పూర్తి చేసుకోండి.
అప్పటి నుండి ఆమె ఎంతో హుందాగా సాగించిన జీవన పోరాటం దేశంలోని అణగారిన వర్గాల ప్రజలు అందరికి స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం కాగలదు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజానికి సేవ చేయడానికి, పేద, అణగారిన, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి అంకితం చేశారు. రాజకీయ జీవితాన్ని పెంపొందించుకోవడం కోసం ఎదురైన ప్రతి కష్టాన్ని, బాధను ఆమె ధైర్యంతో ఎదుర్కొన్నారు.
పైగా, ఆమెకు గొప్ప పరిపాలనా అనుభవం ఉంది. ఒడిశాలో మంత్రిగా, అత్యుత్తమ శాసన సభ్యురాలిగా, మధ్య భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించిన అన్ని వర్గాల ప్రశంసలు పొందారు.తన అనుభవం, విధానపరమైన విషయాలపై గల అవగాహన, దయగల స్వభావం మొత్తం భారత్కు ఎంతో ప్రయోజనం చేకూర్చగలడు.
ఆమె రాష్ట్రపతి కావడం కేవలం గిరిజనులకే కాకుండా మొత్తం భారత ప్రజలకు గర్వకారణం కాగలదు. వినయం, ఆత్మస్థైర్యం, చిత్తశుద్ధి, నిజాయితీ, అట్టడుగు ప్రజల పట్ల అంకితభావం గల ఆమె సేవలు దేశ పురోగతికి మార్గదర్శనం కాగలవు. అటువంటి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వస్తే మన ప్రజాస్వామ్యంకే హుందాగా ఉండెడిది.