బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో కనీస వేతనాల్లేక, వివక్షకు గురవుతున్న పూజారులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్ఛారు.
బిజెపి రాష్త్ర కార్యాలయంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన వందలాది మంది గిరిజనులతో సంజయ్ సమావేశమయ్యారు. అఖిల భారత బంజారా సంఘం నాయకులు క్రిష్ణా నాయక్, జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరు కనకయ్యతోపాటు పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.
మోదీ హయాంలో గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సంజయ్ తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. మైనారిటీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాంను, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నారు.
నిరంతరం పేదల అభ్యున్నతి కోసం తపించే వ్యక్తి మోదీ అని చెబుతూ అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఖ్యాతి కూడా మోదీకే దక్కుతుందని తెలిపారు. ఈనెల 3న పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున గిరిజనులంతా తరలివచ్చి మోదీకి మద్దతు పలకాలని కోరారు.
కాగా, సంజయ్ సమక్షంలో వందలాది మంది టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరిలో రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం ఛైర్మన్ సామ వెంకటరెడ్డి, చందానగర్ నగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, అఖిల భారత బంజారా సంఘం నాయకులు క్రిష్ణా నాయక్, మాలోతు చంద్రశేఖర్, సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ డాక్టర్ రాజాగౌడ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
టీఆర్ఎస్ లో నిజమైన ఉద్యమకారులకు స్థానం లేదని, ఉద్యమ ద్రోహులకు, ఉద్యమకారులపై దాడులు చేశారో వారే టీఆర్ఎస్ ఫ్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారని వారితో మాట్లాడుతూ సంజయ్ ధ్వజమెత్తారు. జీవించాలంటే, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.