మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేనతో చెలరేగిన `తిరుగుబాటు’ వారం రోజులవుతున్నా పరిష్కారం లభించే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్రపతి పాలనా అనివార్యం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్యెల్యేల కార్యాలయాలపై దాడులు, నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉండడం, వారు తిరిగి వస్తే దాడులు తప్పవని అంటూ బెదిరింపులు చేస్తుండడంతో గవర్నర్ జోక్యం తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవంక, డిప్యూటీ స్పీకర్ నరహరిజైర్వాల్ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ నోటీసుతో పాటు, శివసేన శాసనసభాపక్ష నేతగా అజరు చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ రెండు పిటిషన్లను దాఖలు చేసింది.
అనర్హత పిటిషసన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్ను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. అలాగే తమ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరారు. సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు విచ్ఛిన్నమైతే, కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచాలని కోరుతూ గవర్నర్ బిఎస్ కోషియారీ కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ వ్రాయడం పరిస్థితుల తీవ్రతను వెల్లడి చేస్తుంది. ప్రస్తుతం గౌహతిలో మకాం వేసిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలపై హింసాత్మక ఆరోపణలు చేసిన తర్వాత గవర్నర్ ఈ చర్యకు ఉపక్రమించారు.
జూన్ 25న గవర్నర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఈ లేఖను కేంద్రంకు పంపినట్లు వెల్లడైనది. ఎమ్మెల్యేలకు తగిన రక్షణ కల్పించాలని తాను పోలీసులను కోరానని, అయినప్పటికీ, శాసనసభ్యుల కార్యాలయాలు, ఇళ్లను ధ్వంసం చేయడంతో పోలీసులు మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని లేఖలో ఆయన భల్లాకు తెలియజేశారు.
షిండే శిబిరంలో ఉన్న ప్రహర్ జన్ శక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ భద్రతను ఉపసంహరించుకున్నారని ఫిర్యాదు చేయడంతో గవర్నర్ ఈ చర్యకు దిగిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలకు మహారాష్ట్రలోని వారి నివాసాలలో కేంద్రం కేంద్ర బలగాల రక్షణ కల్పించింది.
నెహ్రూ నగర్ ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగినప్పుడు విధ్వంసానికి పాల్పడిన సందర్భాలు కనిపించాయి. శనివారం పూణెలోని ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయాన్ని ముట్టడించి, మహిమ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కార్యాలయానికి మోర్చా తీసుకెళ్లారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు.
శనివారం ఆసుపత్రిలో ఉన్న గవర్నర్, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాస్తవ, అదనపు ముఖ్య కార్యదర్శి (హోం) ఎఎం లిమాయే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రజనీష్ సేథ్, పోలీసు కమిషనర్ సంజయ్ పాండేలకు భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ లేఖలు పంపారు.
గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేల కుటుంబాలు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలు, ఇళ్లకు తక్షణమే తగిన పోలీసు రక్షణ కల్పించాలని శ్రీవాస్తవ, లిమాయే, సేథ్, పాండేలను ఆయన ఆదేశించారు. కాగా, నవీ ముంబైలోని తలోజాలో ఉన్న తమ స్థావరానికి కేంద్ర బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు గౌహతి నుంచి నగరానికి తిరిగి రాగానే కేంద్ర బలగాలు వారిని రాజ్భవన్కు తీసుకెళ్తాయని బీజేపీ అగ్రనేత ఒకరు తెలిపారు.