మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రేపటితో తెరపడేనా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. జూన్ 30న బలపరీక్షకు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకులతో సమాలోచనలు జరిపి తిరిగి వాస్తు మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా గవర్నర్ ను కలిశారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మెజార్టీ కోల్పోయారని, వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు. దీంతో గవర్నర్ గురువారం బలపరీక్ష నిరూపించుకోవాలని ఉద్ధవ్కు బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.
గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటికే గువహటిలోని ఓ హోటల్లో మకాకం వేసిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం ముంబయికి చేరుకోనున్నారు. ఆ అసమ్మతి వర్గంంలో 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు మరో 10 మంది స్వతంత్రులు ఉన్నారు.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం శాసన సభలో ఆధిక్యత కోల్పోయిన్నట్లు స్పష్టం అవుతున్నది. ఇప్పుడు బలపరీక్షకు సిద్ధమౌతుండగా.. ఈ కూటమికి సంఖ్యా బలం లేదు. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 144 మ్యాజిక్ ఫిగర్ అయితే, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఇటీవల వరకు 152 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
అయితే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి, ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.