కేరళలో గురువారం రాత్రి తిరువనంతపురంలోని సిపిఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఎకె గోపాలన్ సెంటర్లో ఉన్న కార్యాలయంపై రాత్రి 11.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పికె శ్రీమతి కార్యాలయంలోనే ఉన్నారు.
బాంబు పార్టీ కార్యాలయం గేటు వద్ద పడటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సిసిటివి కెమెరాల్లో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరి పరారౌతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పార్టీ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ దాడి ఘటనను ఖండించిన సిపిఎం నేతలు నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పనేనని నేతలు విమర్శించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎల్డిఎఫ్ కన్వీనర్, సిపిఎం నేత ఇపి జయరాజన్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఎకె గోపాలన్ సెంటర్ కార్యాలయంపై దాడి జరగడం ఇది మూడోసారి.
ఇటీవల వయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాయలంపై దాడి జరగ్గా ఇది అధికార పార్టీ కార్యకర్తల పనే అని ఆ పార్టీ ఆరోపించింది. కాగా, రాహుల్ గాంధీ నేడు కేరళను సందర్శిస్తున్న సమయంలో ఈ బాంబు దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
”కేరళలో హింసను ప్రోత్సహించే నాయకత్వం కాంగ్రెస్కు ఉంది. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతాం’’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ తెలిపారు. ఘటన జరిగిన అరగంట తర్వాత నగరంలో పెద్ద సంఖ్యలో సీపీఎం, డీవైఎఫ్ఐ మద్దతుదారులు నిరసన ప్రదర్శన చేపట్టారు.