మహారాష్ట్రంలో ఏక్నాథ్ షిండే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం బలపరీక్షకు ముహూర్తం ఖరారైంది. 2, 3 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్పీకర్ పదవికి బిజెపి ఎంఎల్ఎ రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఒకవేళ స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు. అదే జరిగితే 4న బలపరీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శాసన సభలో తన మెజారీటిని నిరూపించుకోనున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ కోశ్యారీ ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం 4న షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనుంది. మూడో తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
శనివారం మధ్యాహ్నం 12.30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీజేపీ నుంచి కోలాబా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. ఈ పదవికి బీజేపీ పోటీ పడడం ఇదే మొదటిసారి! శివసేనకు చెందిన 49 మంది శాసనసభ్యుల మద్దతు షిండేకు ఉంది. అంతేగాక బిజెపికి చెందిన 106 మంది ఎంఎల్ఎలు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థ్థులు కూడా ఏక్నాథ్ వైపే ఉండటంతో శాసన సభలో షిండే మెజార్టీ నిరూపణ లాంఛనంగా మారనుంది.
సభలో బల నిరూపణ పూర్తయిన తరువాత షిండే తన కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. తమకు 175మంది సభ్యుల బలం ఉందని, సోమవారం జరిగే బలపరీక్ష లాంఛనమేనని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. గురువారం రాత్రి ప్రమాణస్వీకారం, తొలి కేబినెట్ భేటీ తర్వాత ఆయన అర్ధరాత్రి గోవా వెళ్లారు.
అక్కడి విమానాశ్రయంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఉంటున్న దోనా పౌలా రిసార్ట్లో ఏక్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన 50 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని పేర్కొన్నారు.
కాగా, 2019 ఎన్నికల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్షా తన మాటపై కట్టుబడి ఉండి ఉంటే ఇప్పు డు మహారాష్ట్రలో బీజేపీ సీఎం ఉండేవారని తాజా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని పంచుకునే(రొటేటింగ్) ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లామని.. పొత్తును పక్కనపెట్టిన బీజేపీ సొంతంగా ప్రభుత్వానికి సిద్ధపడిందని గుర్తుచేశారు.
ఇలా ఉండగా, నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు శివసేన పార్టీ సభ్యత్వం నుండి తొలగిస్తున్నల్టు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఝలక్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినందుకుగానూ తొలగిస్తున్నట్లు శుక్రవారం ఓ అధికారిక లేఖ ద్వారా షిండేకు థాక్రే తెలియజేశారు.
పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడినందుకుగానూ స్వచ్ఛందంగా ఆయన(షిండే) తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై పార్టీలోని ఏ పదవిలోనూ(ప్రాథమిక సభ్యత్వంతో సహా) ఆయన ఉండబోరని లేఖలో థాక్రే వెల్లడించారు.