పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు శనివారం మీడియాలో కధనాలు వెలువడ్డాయి. పంజాబ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గత ఏడాది ఆ పదవికి రాజీనామా చేయమనడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, పంజాబ్ జన కాంగ్రెస్ అనే పార్టీని ఏర్పాటు చేశారు.
బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకొని, ఆ పార్టీ గుర్తు పైననే ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా తాను స్వయంగా ఓటమి చెందడమే కాకుండా, తన పార్టీ నుండి కూడా ఎవ్వరిని గెలిపించుకోలేక పోయారు. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం ప్రస్తుతం లండన్లో ఉన్నారు.
ఆయన తిరిగి రాగానే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ప్రధాని ఆయనకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో ఈ కధనాలు వెలువడినట్లు కనిపిస్తున్నది. తన పార్టీని బీజేపీలో విలీనం చేయడం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే, ఇందుకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జి సింగ్ గ్రెవాల్ శనివారంనాడు తెలిపారు. లండన్కు వెళ్లే ముందే తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉందని సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారని, లండన్ నుంచి రాగానే పార్టీ విలీనంపై ప్రకటన చేస్తారని గ్రెవాల్ చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేసే చివరి తేదీ జూలై 19 కాగా, ఎన్నికలు ఆగస్టు 6న జరుగుతాయి.