హైదరాబాద్ లో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలలో హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో హెచ్ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు బిజెపి సిద్ధమైన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, వాటితో పాటు ఇకపై అధికారం కొనసాగించాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితులపై ఈ సమావేశాలలో చర్చిస్తున్నారు.
తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి అనే నినాదాన్ని హైదరాబాద్ వేదికగా ఇవ్వడానికి బిజెపి సిద్దమైన్నట్లు రెండు, మూడు రోజులుగా తెలంగాణ అంతటా పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకుల వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విషయాలపై జాతీయ కార్యవర్గం చర్చించనుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడున్న 119 నియోజకవర్గాల్లో పర్యటించిన నేతల అభిప్రాయాలను కార్యవర్గం తెలుసుకోనుంది. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభ ద్వారా టి ఆర్ ఎస్ విమర్శలను తిప్పికొట్టే అవకాశముంది.
ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధిపై చర్చించి… రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్షా, రాజ్నాథ్సింగ్తో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 348 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
హర్ ఘర్ తిరంగ ద్వారా లభిదారుల చెంతకు
కాగా, కార్యవర్గ సమావేశాలను ప్రారంభిస్తూ ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం ద్వారా పార్టీ 20 కోట్ల మందికి పార్టీ చేరువ కావాలని అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల జాబితాలో ఉన్న 30 కోట్ల మంది లబ్ధిదారులతో పార్టీని కలుపుకుపోవాలని కూడా చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ఒక్కో బూత్లో 200 మంది క్రియాశీలక సభ్యులు ఉండేటట్లు చూడాలని సూచించారు.
“బూత్ను బలోపేతం చేయడం, క్యాడర్తో పరస్పర చర్య చేయడం చాలా ముఖ్యం. ఇది ప్రజలతో పరస్పర చర్చకు సహాయపడుతుంది. ప్రతి బూత్లో 200 క్రియాశీల కేడర్లు ఉండాలి. ప్రజలతో మమేకం కావడానికి అట్టడుగు స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. ప్రధాని మోదీ మన్ కీ బాత్ చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’’ అని ఆయన చెప్పినట్లు పార్టీ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మీడియాకు తెలిపారు.
పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ విజయాల పునాదులు వేసిన పన్న ప్రముఖ్ సంస్థను బలోపేతం చేయనున్నారు. “ప్రతి వారం రాష్ట్ర అధ్యక్షులు బూత్ స్థాయి కార్యకర్తలు, కార్యక్రమాలు, సాధించిన పురోగతిని సమీక్షిస్తారు” అని ఆమె చెప్పారు. నాయకులు క్యాడర్, స్థానికులతో వివిధ ప్రాంతాల్లో ఒక రాత్రి గడిపే ‘ప్రవాస్’ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు.
75 ఏళ్ల భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తామని, దీన్ని పెద్ద ఉద్యమంగా మార్చి దేశాన్ని ఏకం చేస్తామని, 20 కోట్ల మందికి చేరువ చేస్తామని నడ్డా వెల్లడించారు.
ఎన్నికల సమయంలో పార్టీ విజయంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్న 30 కోట్ల మంది లబ్ధిదారుల గురించి ప్రస్తావిస్తూ, పార్టీ వారి వద్ద జాబితా ఉందని, ఇప్పుడు వారిని చేరుకోవడానికి, వారిని పార్టీ దగ్గరకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తామని వసుంధర రాజే వివరించారు. “ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంలో, పథకాలు నిలిచిపోకుండా చూసుకోవడంలో ఇది సహాయపడుతుంది” అని ఆమె స్పష్టం చేశారు.