మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్ మద్దతు పలికారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను తప్పుబట్టారు.
హింసాత్మక ఘటనల వెనుకున్న భావజాలాన్ని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా ఈ తరహా అల్లర్లు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే హింసాత్మక ఘటనల వెనుకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రపంచం భయపడిందని ఆయన పేర్కొన్నారు.
నూపుర్ శర్మ చెప్పినది తప్పని భావించేవారు వచ్చి వాదన చేయాలని, టీవీ డిబేట్లో కారణాలు చెప్పాలని ఆయన హితవు చెప్పారు. నూపుర్ శర్మ మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పకుండా.. కత్తులు దూస్తున్నారని దిలీప్ ఘోష్ ధ్వజమెత్తారు.
వివాదాస్పద ‘కాళీ’ పోస్టర్పై ప్రశ్నించగా తాము ప్రగతిశీల, సెక్యూలర్ వ్యక్తులమని చెప్పుకునేందుకు కొంతమంది హిందుత్వాన్ని తిడుతుంటారని దిలీప్ ఘోష్ ఎద్దేవా చేశారు. కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు పోస్టర్ విడుదల చేయడం కూడా ఇలాంటిదేనని ఆయన అభివర్ణించారు. తమ గురించి జనాలు మాట్లాడుకునేందుకు ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడతారని ఆయన ‘ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ 2022’లో తెలిపారు.