ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం నేటితో ముగియనున్నది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశమే వారికి చివరి సమావేశం అవుతుందా? లేదా ఎంపీ కాకపోయినా ఆరు నెలల పాటు మంత్రివర్గంలో కొనసాగే అవకాశం వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తారా? లేదా వారిని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో రాజ్యసభకు నామినేట్ చేస్తారా? తెలియవలసి ఉంది.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (బిజెపి), కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (జెడియు) ల రాజ్యసభ పదవీకాలాన్ని జూలై 7న ముగియనుంది. బిజెపి, జెడియు పార్టీలు వారిని మళ్లీ రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో తిరిగి పంపలేదు. జులై 7తో పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎంపిలుగా ఎన్నిక కాకపోతే మంత్రులిద్దరూ కేబినెట్ సీట్లు కోల్పోతారు.
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని బిజెపి మళ్లీ నామినేట్ చేయక పోవడంతో ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి నామినేట్ చేయనున్నాదనే వార్తాకథనాలు వస్తున్నాయి. మరోవంక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు నమ్మకస్తుడు, జెడియులో నెంబర్ 2గా ఉన్న రామచంద్ర ప్రసాద్ సింగ్ను, కొన్ని కారణాలతో ఈసారి రాజ్యసభకు పంపటం లేదు.
ఈ మధ్య కాలంలో ఆయన బిజెపికి దగ్గరై, పార్టీ ప్రయోజనాలకు స్పందించడం లేదనే ఆగ్రహంతో ఆయనకు తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ను దూరం చేసుకొనేందుకు బిజెపి సిద్ధంగా లేకపోవడంతో ఆయనను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు కూడా తక్కువని పరిశీలకులు భావిస్తున్నారు.
మంత్రులు ఎంపిలుగా లేనప్పుడు కూడా ఆరు నెలల పాటు కొనసాగవచ్చు, కానీ అలా సాధారణంగా జరగదు. అయితే, క్యాబినెట్ అపాయింట్మెంట్ తర్వాత మంత్రులను ఎంపిలుగా చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు మంత్రుల భవితవ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా లేదంటే, ఏదైనా రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్గా పంపుతారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రామచంద్ర ప్రసాద్ సింగ్ త్వరలో బిజెపిలో అధికారికంగా చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రపతి నామినేషన్ తరువాత భర్తీ చేయాల్సిన ఏడు రాజ్యసభ స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరు ఎంపిలు మంత్రులుగా కొనసాగుతారా? లేక రాష్ట్రపతి సిఫారసు మేరకు రాజ్యసభకు పంపబడతారా? అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.