పోచారం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి మాట తప్పిందని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె మండిపడ్డారు. కమీషన్ వచ్చే ప్రాజెక్టులు తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ల గురించి కేసీఆర్కు పట్టదని ఆమె ఎద్దేవాచేశారు.
‘‘కాళేశ్వరం సర్వరోగ నివారిణిగా చెబుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుండు. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలన్న జిల్లా రైతుల డిమాండ్ను పాలకులు అసలు పట్టించుకుంటలేరు” అంటూ ఆమె విమర్శించారు.
అధికార పార్టీ పాలకులు ఎన్నికల సమయంలో ప్రాజెక్ట్ పెంపుపై హామీలిచ్చి ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారిందని విజయశాంతి విచారం వ్యక్తం చేశారు. వందేండ్ల కింద 2.43 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో 10,500 ఎకరాలకు సాగు నీరు అందుతోందని ఆమె గుర్తు చేశారు.
ప్రాజెక్టుతో పాటు కాల్వల్లో నీటి నిల్వతో సమీప గ్రామాల్లో భూగర్భ నీటి మట్టాలు కూడా బాగా ఉంటాయని చెబుతూ ప్రాజెక్టులో పూడిక చేరడంతో ప్రస్తుతం నీటి నిల్వ కెపాసిటీ 2.43 టీఎంసీల నుంచి 1.8 టీఎంసీలకు పడిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు వర్షకాలంలో ప్రాజెక్టుకు భారీగా వచ్చే వరద నీరు వృథాగా పోతోందని, ఏటా 2 నుంచి 3 టీఎంసీలకు పైగా నీరు మంజీరాలో కలుస్తోందని ఆమె తెలిపారు.
ప్రాజెక్టు ఎత్తు పెంచితే వరద నీరు ఇక్కడ కొంతవరకైనా స్టోరేజీ ఉండే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే ప్రస్తుతం ఉన్న 10,500 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకూ నీరు అందడంతో పాటు అదనంగా మరో 5 వేల ఎకరాల వరకు ఆయకట్టు పెరిగే అవకాశం ఉందని విజయశాంతి తెలిపారు. కానీ కేసీఆర్ సర్కార్ అసలు ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.
2014, 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ కూడా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచి డెవలప్ చేస్తమని హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కానీ ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆమె ధ్వజమెత్తారు.