వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం గజ్వేల్ నుంచే ప్రారంభమైందని గుర్తు చేస్తూ ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మంత్రివర్గం నుండి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఆమెపైనే పోటీ చేసి, ఆమెను ఓడించిన సువేందు అధికారి తరహాలో కేసీఆర్ ను ఓడించి తీరుతానని భరోసా వ్యక్తం చేశారు.
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్లు తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెబుతూ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ గ్రాఫ్ జారుడు బండ మాదిరి పడిపోతుందని స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఎస్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? అంటూ ప్రశ్నించారు. అందుకు టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని హెచ్చరించారు.
కాగా, కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని ఆయన సహచర బీజేపీ నేతలకు సూచించారు. అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే కనిపించాలని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమైనట్లు ఈటెల తెలిపారు. రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని చెబుతూ ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉందని రాజేందర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కోలుకోవడం కష్టమని, ఆ పార్టీ ఖాళీ కాబోతోందని చెప్పారు.
‘‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారారు. పేదల భూములు గుంజుకొని వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వందల ఎకరాల మీద కేసీఆర్ కన్ను పడింది. 2000 ఎకరాలు అమ్మి లక్ష కోట్లు దండుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్లో భూములను అమ్మి, వచ్చే డబ్బులతో రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు’’ అని ఈటల ఆరోపించారు.
పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కుపత్రాలు ఇస్తామని సీఎం కేసీఆర్ మూడుసార్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించి, మాట తప్పారని ఈటెల విమర్శించారు. కొత్తగా హక్కు పత్రాలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు నిజాం, బ్రిటి్షవారికంటే ఎక్కువ దౌర్జన్యం చేస్తూ గిరిజనుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగానైనా పోడు సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.