టీఆర్ఎ్సలో చాలామంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని, అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం తన రెండు గంటల మీడియా సమావేశంలో వందసార్లు షిండే గురించి ప్రస్తావించారని, దీన్నిబట్టే టీఆర్ఎ్సలో ఏదో జరుగుతోందని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. టీఆర్ఎ్సలో ఎవరు షిండేలో తెలుసుకోవాలని సూచించారు.
“కుంగుబాటులో ఉన్నడు. ఆయన ముఖ కవళికల్లో తేడా కన్పిస్తోంది. మహారాష్ట్ర ప్రజలు, నాయకులు కూడా తలచుకోనంతగా ఏక్నాథ్ షిండేను గుర్తుకు చేసుకుంటున్నడు. బహుశా ఆయన కుటుంబంలోనో, పార్టీలోనో కొందరు షిండేలుగా మారుతున్నట్లున్నరు. అది తెలిసి బీజేపీపై అభాండాలు వేస్తున్నడు” అంటూ సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని, తాము కూల్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. నువ్వు చేసిన సర్వేల్లోనే తెలుస్తుంది కదా అంటూ ఎద్దేవా చేశారు.
‘‘కృష్ణా జలాలను ఏపీ దోచుకుపోతుంటే ఎందుకు మాట్లాడ్డం లేదు? ఆర్డీఎస్ గురించి ఎందుకు స్పందించరు? దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు? దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఏమైంది? ఆర్టీసీ ఉద్యోగులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నరు?’’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజూ పడిపోతుంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఓడించాలని సవాల్ చేశారు. ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. యూపీలో యోగీ సీఎం అయ్యాక, కాకముందు ఆయన కుటుంబం పరిస్థితి, కేసీఆర్ సీఎం కాకముందు, ఇప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.