కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 21న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు.
గత నెలలో ఈడీ ఎదుట సోనియా హాజరుకావాల్సి ఉండగా కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని దర్యాప్తు సంస్థకు తెలిపారు. కరోనా సోకిన నేపథ్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని గత నెలలో తెలిపారు.
ఇక.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. సోనియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు మరోసారి తాజా నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ ను ఇప్పటికే ఐదు రోజుల పాటు సుమారు 50 గంటల సేపు విచారణ జరిపారు.
రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని కూడా అడగనున్నట్లు భావిస్తున్నారు. “యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య ఒప్పందంలో ఆమె పాత్ర గురించి మేము అడగాలి” అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. సోనియా, రాహుల్ గాంధీని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత నెలలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.