నూతన పార్లమెంటు భవనం పైకప్పుపై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తుతో కూడిన నాలుగు సింహాలతో కూడిన జాతీయ చిహ్నాన్ని పార్లమెంటు భవనంపై నెలకొల్పడం రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమన్న విమర్శలు వస్తున్నాయి..
జాతీయ చిహ్నం ఆవిష్కరించిన తరువాత ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నిమగమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో మోడీ మాట్లాడారు.. ‘పార్లమెంటు నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రమజీవులతో నేను అద్భుతంగా సంభాషించాను. వారి ప్రయత్నాలకు మేము గర్విస్తున్నాము. మన దేశానికి వారు చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం’ అని మోడీ అన్నారు.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్సిపి డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంటు భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 1.రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, 2.లోక్సభ స్పీకరు, రాజ్యసభ ఛైర్మన్, ఎంపిలు, 3.సాధారణ ప్రవేశమార్గం, 4.ఎంపిల కోసం మరో ప్రవేశమార్గం, 5, 6 ప్రజల ప్రవేశ మార్గాలుగా నిర్ణయించారు.
ఈ భవనాన్ని నాలుగు అంతస్తులతో నిర్మిస్తున్నారు. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ ఛాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునేలా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఈ భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపిల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 93 ఏళ్లనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.