రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటిస్తూ శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటన చేయడంతో మహావికాస్ అఘాఢీలో లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సంకీర్ణ కూటమి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
త్వరలో బృహణ్ ముంబై కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ శివసేన తన వైఖరిని మార్చుకుంటోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవర ఆరోపించారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన సంకీర్ణ ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా శివసేనపై కఠిన వ్యాఖ్యలు చేసే మిలింద్ దేవర ఇప్పడు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలం లేకపోయినా కుయుక్తలతో అధికారంలోకి వచ్చేందుకు ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన ప్రయత్నిస్తోందని, వార్డుల పునర్విభజన ద్వారా కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తూ ఇటీవల కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లకు దేవర లేఖ రాశారు.
ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్ ధాకరేకు మహావికాస్ అఘాడీ కూటమిలోని ప్రధాన పక్షాలైన, పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయినప్పటికీ షిండే వర్గం మెజారిటీ కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.
ఆ పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గం కూడా ముర్ముకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ కూటమినుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.