2002లో గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని, ఆ కుట్ర అమలుకు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహకరించారని గుజరాత్ పోలీసులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. తీస్తా, మాజీ ఐపిఎస్ పి.బి.శ్రీకుమార్ల బెయిల్ పిటిషన్లను పోలీసులు వ్యతిరేకించారు.
గుజరాత్లో మతోన్మాద ఘర్షణల్లో ఉన్నతాధికారులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో తీస్తా, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్లకు పాత్ర వుందని పోలీసులు ఆరోపించారు.
సంజీవ్భట్తో కలిసి కాంగ్రెస్నేత అహ్మద్ పటేల్ను ఆయన నివాసంలో సెతల్వాద్ కలుసుకున్నారని, మతోన్మాద ఘర్షణల్లోని బాధితులకు న్యాయం జరగాలనే పేరుతో గుజరాత్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క తనకు రాజ్యసభ సీటు కోసం తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.
”అప్పటి ముఖ్యమంత్రి ఇతరులను ఇరికించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసే చర్యలకు పాల్పడేందుకు గాను తీస్తా డబ్బు తీసుకున్నారని ఇద్దరు సాక్షులు చెప్పిన సాక్ష్యాధారాలను పోలీసులు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.
అహ్మద్ పటేల్ నుంచి ఆమెకు రూ.30 లక్షలు అందాయని పోలీసులు చెప్పారు. సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తాజాగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో సిట్ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ అంశాలను తెలిపారు. గుజరాత్ అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె సమర్పించిన దరఖాస్తును ‘సిట్’ తిరస్కరించింది. సెతల్వాద్కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి డి.డి.ఠక్కర్ సోమవారానికి వాయిదా వేశారు. గుజరాత్ మత కలహాల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమాయకులను ఇరికించేలా తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలతో తీస్తా సెతల్వాద్తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
మరోవంక, అహ్మద్ పటేల్ కేవలం మధ్యవర్తి మాత్రమే అని, అసలు కుట్రపన్నినది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ ఆరోపించారు. ఈ విషయమై ఆమె నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గుజరాత్ పోలీసుల అఫిడవిట్పై కాంగ్రెస్ మండిపడింది. మరణించిన అహ్మద్ పటేల్పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. గుజరాత్ 2002 అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా తనపై ఉన్న మారణ హోమానికి సంబంధించిన మరకలను తొలగించుకునేందుకు ప్రధాని మోదీ పకడ్బందీగా అమలు చేస్తున్న వ్యూహంలో భాగమే ఇదంతా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
ప్రధాని రాజకీయ ప్రతీకారేచ్ఛ చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టడం లేదని తెలిపారు. తమ నేత ఏం చెబితే అది గుజరాత్ పోలీసులు చేస్తున్నారని విమర్శించారు.