భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుంది. ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారని అంటూ చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని, కానీ ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని విమర్శించారు.
గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చినయ్,ఈసారి కూడా వచ్చినయ్, భవిష్యత్తులో రావని కూడా చెప్పలేం, కానీ కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ స్రుష్టిలా కన్పిస్తోందని, పైగా విదేశాల కుట్ర అనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్ అంటూ తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందని గుర్తు చేశారు.
మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని విమర్శించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారని చెప్పారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు.
జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరని, జీతాలివ్వడం చేతగాక వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్… పోరంబోకు మాటలాపి భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటావో చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తాననడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని స్పష్టం చేసారు.
సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? అని ప్రశ్నించారు. పైగా గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ సొంతం అని గుర్తు చేశారు. చేసిన అరకొర సాయం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిన విషయం ప్రజలింకా మరువలేదని ధ్వజమెత్తారు.
వాస్తవానికి సీఎం పర్యటనలో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, బాధితుల సంఖ్యపై అంచనా వేసి.. ఆర్ధిక సాయం ప్రకటిస్తారని ఆశించామని చెప్పారు. కానీ అవేమీ లేకుండా కేసీఆర్ పర్యటన గాలి పర్యటనలా మారిందని దుయ్యబట్టారు. పైగా కరకట్టల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం, 10 వేల ఇండ్లతో కాలనీని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.
ఇప్పటికే అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తా… ఇంటింటికో ఉద్యోగం ఇస్తా… దళితుడిని సీఎంను చేస్తానన్న హామీలాలంటిదే ఇది కూడా అంటూ ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో పిల్లలు చదువుకుందామంటే పుస్తకాల్లేవు. చాక్ పీసులకు పైసల్లేవు. ఉద్యోగులకు జీతాల్లేవు… కానీ 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాననడం చూస్తే నవ్వొస్తోందని చెప్పారు.