నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో గురువారం సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అనుకున్న సమయానికి కన్నా ముందే విచారణను నిలిపివేసింది. ఇటీవల కోవిడ్ నుండి కోలుకున్నానని ఇడి అధికారులకు విజ్ఞప్తి చేయగా.. ఆమెను అనుకున్న సమయాని కన్నా ముందుగా విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
దాదాపు మూడు గంటలపాటు ఈడీ అధికారులు సోనియాఫై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మూడు గంటలోనే 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణించిన ఈడీ అధికారులు తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. ఆమె కోసం 50 ప్రశ్నలు సిద్ధం చేశారని తెలుస్తోంది.
మధ్యాహ్నం రెండున్నరకు ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజుల్లో అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని కూడా అడిగి ఉండవచ్చని ఈడి వర్గాలు తెలిపాయి. యంగ్ ఇండియా (వైఐ), అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య జరిగిన డీల్లో ఆమె పాత్ర గురించి ఈడీ సోనియా గాంధీని ప్రశ్నిస్తుంది.
ఉదయం, తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.
వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్నా కరోనా కారణంగా హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కోవిడ్ అనంతరం సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని అయిదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది.
ఇక ఇదే కేసులో ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ఐదు సిట్టింగ్స్లో సుమారు 50 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధఙర్ రంజన్ చౌదరీ, సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ తదితరలు పాల్గొనగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లోని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తగలబడుతున్న బైక్ను మంటలు ఆర్పారు. సోనియా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. డీఎంకే, శివసేన, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం సహా మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు సోనియాకు మద్దతు పలికారు. పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యి ప్రకటన విడుదల చేశారు.
అధికార దుర్వినియోగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై కేంద్రం నిరంతరం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్షాల్లోని కీలక నేతలే లక్ష్యంగా కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు.