శివసేన మాదంటే మాదేనని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఎన్నికల కమిషన్ చెంతకు చేరింది. అసలైన శివసేన వర్గం మాదేనని, పార్టీని పూర్తి స్థాయిలో తమకు అప్పగించాలని ఏక్నాథ్ వర్గం ఎన్నికల కమీషన్ కు లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ కోసం మెజార్టీ నిరూపించుకోవాలని, అందుకు సంబంధించిన పత్రాలను ఆగస్టు 8వ తేదీలోగా సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన షిండే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి, బిజెపి మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇటు 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గం వైపుకు రాగా, 12 ఎంపిలు సైతం ఉద్ధవ్కు షాక్నిచ్చారు. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, అసలైన శివసేన తమదేనంటూ ఏక్నాథ్ షిండే వర్గం చెబుతూ వస్తోంది. తమదే అసలైన పార్టీగా గుర్తించాలని పేర్కొంటూ ఇసికి లేఖ రాసింది. పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం తమకు కేటాయించాలని కోరింది.
అటు ఉద్ధవ్ థాకరే వర్గం కూడా ఇసికి లేఖలు రాశారు. శివసేనలో కొందరు పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించింది. పార్టీ తమదేనని నిర్ణయించాలని పేర్కొంది. అంతేకాకుండా.. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గం తమకే.. శివసనే పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. రెండు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీలో తమ మెజార్టీని నిరూపించుకునేందుకు అవసరమైన లిఖితపూర్వక పత్రాలను ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది.
అంతేగాక, పార్టీలో విభేదాలపై పూర్తి వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ఈసీ రాజ్యాంగ కమిటీ దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ ఎన్నికల్లోపు వివాదం తేలకపోతే ఈసీ శివసేన పార్టీ గుర్తును స్తంభించి, ఇరు వర్గాలు తాత్కాలిక పేర్లు, గుర్తులతో తమ పార్టీలను నమోదు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం సూచించే అవకాశాలున్నాయి.