భవిష్యత్ తరాల కోసం పర్యావరాణాన్ని రక్షించుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 14వ రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా జాతిని ఉద్దేశించి కోవింద్ ప్రసంగించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న తమ మూలాలను యువత మనస్సులో ఉంచుకోవాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘దేశ ప్రథమ పౌరుడిగా నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వాల్సి వస్తే.. అది ఇదే’ అని రామ్నాథ్ పేర్కొన్నారు. తన ఐదేళ్ల పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, ఎస్.రాధాకృష్ణన్, ఎపిజె అబ్దుల్ కలాం వంటి గొప్ప రాష్ట్రపతులకు తగిన వారసునిగా ఉండటానికి తీవ్రంగా కృషి చేశానని తెలిపారు.
తన ముందు పదవీలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని చెప్పారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని యువతరం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
తాను సాధారణ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానని పేకరోన్తు ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని పొందడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ‘ఉత్తరప్రదేశ్లోని పరౌంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే.. అందుకు కారణం ప్రజాస్వామ్య సంస్థల స్వాభావిక శక్తే’ అని చెప్పారు.
యువతరం తమ గ్రామం/పట్టణంతో, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుసంధానం కలిగి ఉండే సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనగడ సాగించలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వసించారని గుర్తు చేశారు.
21వ శతాబ్దాన్ని భారత దేశ శతాబ్దంగా మార్చుకొనేందుకు మన దేశం సన్నద్ధమవుతోందని తాను దృఢంగా నమ్ముతున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులతో ఏర్పడిన ప్రస్తుత సంక్షోభం భూగోళం భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. భావితరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని కాపాడుకోవాలని కోవింద్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కృతజ్ఞతలను కోవింద్ తెలిపారు.