దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించా రు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రెండో మహిళా రాష్ట్రపతి కాగా.. తొలి గిరిజన రాష్ట్రపతి కావడం విశేషం.
దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు.
“నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ” అని ఆమె పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా” అని పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా ఆమె ప్రసంగించారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెబుతూ అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామని పిలుపిచ్చారు.
రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అక్కడ సైనిక వందనం స్వీకరించారు.