రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు లోక్సభలోపెద్ద ఎత్తున నిరసనకు దిగి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని అవమానపరిచిందని, ఆ పార్టీ లోక్సభా పక్షనేత అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు.
అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియాగాంధీ ఆమోదించారని స్మృతిఇరానీ విరుచుకుపడ్డారు. ఆమె బలహీన వర్గాలకు వ్యతిరేకమంటూ దుయ్యబట్టారు. అధికార, విపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
మరో పక్క కరోనా నుంచి కోలుకుని సభకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపై పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నా చేస్తున్న బిజెపి సభ్యులకు ఆమె మద్దతు పలికారు. ‘ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్య. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
‘రాష్ట్రపత్ని’ అంటూ అధిర్ రంజన్ చౌధరి వాడిన పదం ఈ దుమారానికి దారి తీసింది. కాగా ఈ నిరసనల నేపథ్యంలో ఆయన వెంటనే క్షమాపణలు చెప్పారు. పొరబాటున నోరు జారినట్లు అంగీకరించారు. ధరల పెరుగుదల, జిఎస్టి, అగ్నిపథ్లనుం చి దేశప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి ఈ విషయాన్ని పెద్దది చేస్తోందని విమర్శించారు. కాగా ఈ నిరసనలపై సోనియా స్పందిస్తూ అధిర్ రంజన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రపతి వివాదంపై అధికార, విపక్షాల సభ్యుల నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కూడా దీనిపై సోనియా క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి సభ్యులు లోక్సభలో కొంత సేపు నినాదాలు చేశారు.
కాగా సోనియా గాంధీ సభలో ఒక దశలో భయపట్టే విధంగా ప్రవర్తించారని, తమ పార్టీకి సంబంధించిన కొంత మంది సభ్యులను బెదిరించారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి బదులు మరింత దూకుడుతనం ప్రదర్శించారని ఆమె ఆరోపించారు.
కాగా తాను చేసిన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ చౌధరి వివరణ ఇస్తూ ‘రాష్ట్రపతిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. అది పొరపాటుగా జరిగింది. పూర్తిగా నా తప్పే. ఒకవేళ రాష్ట్రపతి అవమానంగా భావిస్తే నేరుగా వెళ్లి క్షమాపణలు చెప్తాను. నేను చేసిన పొరపాటుకు కావాలంటే నన్ను ఉరితీయండి. శిక్షకు నేను సిద్ధమే. అంతేకానీ ఈ వివాదంలోకి మేడమ్(సోనియాగాంధీ)ను ఎందుకు లాగుతున్నారు?” అంటూ ప్రశ్నించారు.
మరోవంక, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌధురికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లు) గురువారం నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరయి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎంపిని ఎన్సిడబ్లు కోరింది. ఆగస్టు 3న ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ అధిర్కు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్రంజన్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా మహిళా కమిషన్ లేఖ రాసింది. ఎంపి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సిడబ్లు సహా 12 రాష్ట్రా మహిళా కమిషన్లు ఒక సంయుక్త ప్రకటన విడుద చేశాయి.
విశాఖపట్నంలో జరుగుతున్న మహిళా కమిషన్ల త్రైమాసిక సమావేవానికి హాజరయిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్లు ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఒక ట్వీట్లో తెలియజేశారు.