తెలంగాణలో కేసీఆర్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని, కుమ్ములాటలతో కాంగ్రెస్ ముందుకు కదలడం లేదని, రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలలో కేంద్రంలోని నరేంద్ర మోదీ పరిపాలన పట్ల సానుకూల వాతావరణం ఉన్నదని భావిస్తున్న బిజెపి నాయకత్వం వచ్చే ఎన్నికలలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు పట్టుదలగా పనిచేస్తున్నది.
నేరుగా కేంద్ర నాయకత్వమే ఎన్నికల, ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ, రాష్ట్ర పార్టీ నాయకులకు మార్గదర్శనం చేస్తున్నది. పరిస్థితులు ఎంతసానుకూలంగా ఉన్నప్పటికి ఎన్నికలలో గెలుపొందే బలమైన అభ్యర్థుల కొరత ఉన్నట్లు పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించినట్లు తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించే నాయకత్వ కొరత ఉన్నట్లు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని రాజకీయ పరిష్టితులపై సొంతంగా సర్వేలు జరిపించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయమై రాష్ట్ర నాయకత్వంకు నిర్దుష్టమైన సూచనలు చేసిన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సొంత బలం సరిపోదని, ఇతర పార్టీల్లో గెలిచే అవకాశం ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర పార్టీని ఆదేశించింది.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై అంతర్గతంగా సర్వే చేసిన కేంద్ర పార్టీ ఆ నివేదికనురాష్ట్ర పార్టీకి పంపించింది. అందులో ఏ నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో వారి పేర్లను కూడా తెలియజేస్తూ, వీరిని పార్టీలోకి చేర్చుకోవడంపై సీరియస్ గా దృష్టి పెట్టాలని కూడా సూచించింది.
ఈ సందర్భంగా, గోవా ఫార్మూలాను తెలంగాణలో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు బయటివారిని చేర్చుకోవడం ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి, ఇతర పార్టీల వారిని మెప్పించి బీజేపీలోకి తీసుకోవడమే గోవా ఫార్ములా అని పార్టీ నేతలు చెపుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మొదటి దశ తర్వాత పార్టీలోకి చేరికలు దాదాపుగా ఆగిపోవడం గమనార్హం. కేవలం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఇటీవల చేరిన వారిలో ప్రముఖులు. మరోవంక, కాంగ్రెస్ లో కొందరు ప్రముఖులు చేరుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్రం అప్రమత్తం చేసిన్నట్లు తెలిసింది.
బయటి నుంచి ఫలానా నాయకుడు వస్తే ఆ నియోజకవర్గంలో తమకు టికెట్ రాదని ఎవ్వరిని పార్టీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని, గెలిచే వారు ఎవరైనా సరే పార్టీలోకి చేర్చుకోవాల్సిందేనని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బయటి వారి చేరికపై అసంతృప్తిని వ్యక్తం చేసే పార్టీ సీనియర్ నేతలను ఒప్పించే బాధ్యతను కూడా రాష్ట్ర పార్టీ తీసుకోవాలని సూచించింది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన కార్యకర్తలను, మండల స్థాయి నాయకులను కూడా గుర్తించి వారిని కూడా పార్టీలోకి వచ్చేటట్లు చూడాలని కూడా ఆదేశించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ బూత్, గ్రామ స్థాయిలో ఎన్నికల యాజమాన్యం వహించగల సామర్ధ్యం గల నేతలు ప్రస్తుతం పార్టీలో తక్కువగా ఉన్నట్లు కేంద్ర నాయకత్వం భావిస్తున్నది.