ఎంతటి బలమైన ప్రభుత్వమైనా ప్రతీదాన్ని, ప్రతీ ఒక్కర్నీ నియంత్రించలేదని ప్రధానమంత్రి నరేంద మోదీ స్పష్టం చేశా రు. శుక్రవారం అన్నా యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంస్కరణల స్వభావాన్ని కలిగి ఉందని చెప్పారు.
‘బలమైన ప్రభుత్వ అంటే అన్నింటినీ, ప్రతి ఒక్కర్నీ నియంత్రించాలనే భావన ఇంతకు ముందు ఉండేది. కానీ మేము దానిని మార్చాము. బలమైన ప్రభుత్వం ప్రతీ ఒక్కర్నీ లేదా ప్రతీదాన్ని నియంత్రించదు. బలమైన ప్రభుత్వం అనేది నిర్బంధం కాదు, కానీ ప్రతిస్పందిస్తుంది’ అని ప్రధాని తెలిపారు.
‘బలమైన ప్రభుత్వం.. వ్యక్తుల నియంత్రణ కోసం కాదు. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోదు. దానికీ కొన్ని పరిధులు ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బలమైన ప్రభుత్వం ప్రతీ డొమైన్లోకి వెళ్లదని, తనను తాను పరిమితం చేసుకుంటూ ప్రజల ప్రతిభకు కొంత అవకాశాన్ని ఇస్తుందని మోదీ చెప్పారు. బలమైన ప్రభుత్వ బలం దాని వినయంలోనే ఉంటుందని, తనకు అన్ని తెలుసు, అన్ని చేయగలను అనేదాన్ని బలమైన ప్రభుత్వం అంగీకరించదని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 69 మంది విద్యార్థులకు ప్రధాని డిగ్రీలను ప్రదానం చేస్తూ ప్రపంచ వృద్ధికి భారత్ ఒక ఇంజిన్ వంటిదని చెప్పారు. యువకులే దేశానికి అభివృద్ధి ఇంజన్లని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆహార భాగస్వామ్యంలో భారత్ అత్యంతక కీలక పాత్రను పోషిస్తోందని ప్రధాని గుర్తు చేశారు.
డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని, భారత యువతను ఆహ్వానించేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయని ప్రధాని వివరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ ‘విద్యకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని మేం నమ్ముతున్నాం. అందుకే అక్షరాస్యత పెంచడానికి ‘ద్రవిడ మోడల్’లో పని చేస్తున్నాం’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముందుగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి స్వాగత ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని అభ్యర్థించారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్, మురుగన్, అన్నా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వెల్రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు..