పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో నాలుగు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుతించింది.
లెక్కల్లో చూపించని రూ.11.5 లక్షల నగదును సంజయ్ రౌత్ నివాసం నుంచి ఈడి ఆదివారంనాడు స్వాధీనం చేసుకుంది. దీనిపై ఈడి అధికారులు ఆయనను విచారించి సోమవారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పిఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు.
‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమోలో పేర్కొనబడింది. అంతేకాదు రౌత్ను అరెస్ట్ చేసే ముందు.. కారణాలను సైతం అధికారులు ఆయనకు వివరించారు.
“సంజయ్ రౌత్ విచారణ సమయంలో సహకరించలేదు. అలాగే.. లావాదేవీ వివరాల ఆధారంగా మనీల్యాండరింగ్తో లాభపడింది సంజయ్ రౌత్ అని, తద్వారా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. అంతేకాదు.. సంజయ్ రౌత్, ఈ వ్యవహారంలో ప్రథమ నేరస్తుడిగా ఉన్న ప్రవీణ్ రౌత్కు సహకరించారు. ఇలా మూడు కారణాలతో ఆయన్ని అరెస్ట్ చేసాము” అంటూ అరెస్ట్ మెమో వివరించారు.
కాగా, సంజయ్ రౌత్ అరెస్టును రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేసినట్టు ఆయన తరఫు న్యాయవాది అశోక్ ముండర్గి చెప్పారు. రౌత్ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, సర్జరీ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పేపర్లు కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
ఆపై రౌత్ను న్యాయస్ధానం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక సంజయ్ రౌత్కు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాసటగా నిలిచారు. తాము ఎవరి ఒత్తిళ్లకూ, బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. బాలాసాహెబ్ ఆశయాల వెన్నింటి ఉంటున్న సంజయ్ రౌత్ నిజమైన శివసైనికుడని ఠాక్రే కొనియాడారు.
‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు.