తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తప్పుడు డిజైన్లతో, ఎటువంటు అనుమతుల్లేకుండా నిర్మించారని, అందుకనే ఈ మధ్య వరదలకు ముంపుకు గురయినదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మంగళవారం పవిత్ర క్షేత్రం యాదాద్రి వద్ద నుండి జెండా ఊపి ప్రారంభిస్తూ అందుకనే ఆ ప్రాజెక్ట్ కు తమ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేక పోయినదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన మూడు ఆనకట్టలు మునిగిపోయాయబం అండర్ గ్రౌండ్ లో ఉన్న పంప్ హౌస్ మునిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు డిజైన్ తో నిర్మించారని, ఇంజినీరింగ్ లోపముందని పేర్కొంటూ సరైన ప్లానింగ్ లేకపోవడంవల్ల ప్రాజెక్టు ముంపుకి గురైందని స్పష్టం చేశారు.
కేసీఆర్ అక్రమ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారని చెబుతూ అదెలా సాధ్యం? అని ప్రశ్నించారు. జాతీయ హోదా ఇస్తే తాము బదనాం అయ్యేవాళ్ళం అంటూ జరిగిన తప్పులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిందే అంటూ కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
మరోవంక, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్టమెంట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులతో పాటు ఎట్లాంటి అనుమతుల్లేవని కేంద్ర మంత్రి తెలిపారు.కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ధ్వజమెత్తుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ (ఏటీఎం) అయిందని ఆరోపించారు.
కేసీఆర్ తమ (రాష్ట్ర ప్రభుత్వ) వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని అవినీతి పరులను జైల్లో వేసేందుకు బిజెపికి అధికారం ఇవ్వాలని షెకావత్ కోరారు.
దళితుడైన రాంనాథ్ కోవింద్ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబ హితమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సర్కార్ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదని, అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపం ఈ ప్రభుత్వమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది తెలంగాణ సర్కార్ అని విమర్శించారు. ధర్మాన్ని, న్నాయాన్ని పక్కన పెట్టి నా రాజ్యం అంటూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటూ ఎన్నికలప్పుడు మాత్రమే హామీలిచ్చి అనంతరం మరిచిపోతారని ఎద్దేవా చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండని, లక్ష్మీ నరసింహ స్వామిని ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తన గతి ఏమవుతుందోనని ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నాడని సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ధ్వజమెత్తారు.
కేసీఆర్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపిచ్చారు. కేసీఆర్ ను మట్టికరిపించే అవకాశం హుజురాబాద్ ప్రజలకు దక్కిందని..ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని..అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు, తమకు కేసీఆర్ ను గద్దె దించడమే కనపడుతోందని స్పష్టం చేశారు.