కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇడి షాకిచ్చింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్లో బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ తెవరకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హెరాల్డ్ హౌస్ సీల్కు సంబంధించి ఇడి నుండి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి వుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుండి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.
దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాలు ఉన్నాయి. అలాగే 10 జన్ఫథ్లోని సోనియా గాంధీ నివాసం, ఎఐసిసి ప్రధాన కార్యాలయాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లను ఇడి విచారించిన సంగతి తెలిసిందే. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కిపైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీలోని హెరాల్డ్ కార్యాలయంలో సోదాలు కూడా చేపట్టింది. హెరాల్డ్ హౌస్ పై, బహదూర్ షా జఫర్ మార్గ్పై దాడులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ఎంపి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ఉద్దేశంతో సాగుతున్న మోదీ ప్రభుత్వపు ప్రతీకార రాజకీయాలను ఖండిస్తున్నామని ట్విటర్ లో పేర్కొన్నారు. తమ గొంతుకను అణచివేయలేరంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.