భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను తన వారసునిగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆయన ఆగస్టు 27న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం కోరింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ జస్టిస్ యూయూ లలిత్ను గురువారం సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ను నియమిస్తారు. సీజేఐగా లలిత్ పదవీ కాలం సుమారు మూడు నెలలు ఉంటుంది.
బార్ నుంచి సీజేఐగా ఎదిగిన మొదటి న్యాయ కోవిదుడు జస్టిస్ ఎస్ఎం సిక్రి, ఆయన తర్వాత ఆ ఘనతను దక్కించుకోబోతున్నవారు జస్టిస్ లలిత్. 1971 నుంచి 1973 వరకు జస్టిస్ సిక్రి సీజేఐగా చేశారు. లలిత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఆగస్టులో నియమితులయ్యారు.
తదుపరి సీజేఐగా నియమించేందుకు సిఫారసు లేఖను జస్టిస్ లలిత్కు జస్టిస్ రమణ గురువారం ఉదయం అందజేశారు. జస్టిస్ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేస్తారు. సీజేఐగా జస్టిస్ లలిత్ పదవీ కాలం 74 రోజులు మాత్రమే. ఆయన నవంబరు 8న పదవీ విరమణ చేస్తారు. ఆయన తర్వాత 50వ సీజేఐగా నియమితులయ్యేందుకు తదుపరి సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్.
జస్టిస్ లలిత్ 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా పని చేశారు. ఆయన తండ్రి జస్టిస్ యూఆర్ లలిత్ కూడా సీనియర్ అడ్వకేట్, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేశారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని మెజారిటీ తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ యూయూ లలిత్ ఉన్నారు.
అయోధ్య రామజన్మభూమి కేసులో ధర్మాసనం నుంచి ఆయన వైదొలగారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో కల్యాణ్ సింగ్ తరపున వాదనలు వినిపించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.