పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.
పాఠశాల నియామకాల స్కామ్లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ రూ 50 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు.
ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని ఈడీకి అర్పిత చెప్పగా, ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని చట్టర్జి స్పష్టం చేశారు. పైగా తనను ఎవ్వరో కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
కాగా, పుష్కరకాలంగా వారిద్దరి మధ్య ఆర్ధిక సంబంధాలు, ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని, అర్పిత తీసుకున్న 30కు పైగా జీవిత భీమా సంస్థ పాలసీలలో నమోనిటీ పార్థ చట్టర్జీ పేరున్నదని ఈడీ దర్యాప్తులో వెల్లడైనది. మూడు కంపెనీలలో అర్పిత డైరెక్టర్ కాగా, వాటిల్లో మరో డైరెక్టర్ గా ఓ కార్ డ్రైవర్ ఉన్నారు.
ఇలా ఉండగా, వాదనల సమయంలో అర్పిత ప్రాణానికి ముప్పుందని ఆమె తరపు లాయర్ వాదించారు. అర్పితకు ఇచ్చే నీరు, ఆహారాన్ని కూడా చెక్ చేసి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఆమెను మిగతా నిందితులతో కలిపి కాకుండా ప్రత్యేక గదిలో ఉంచాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తరపున వాదిస్తున్న లాయర్ కూడా దీనికి మద్దతు పలికారు.