ధరలు, నిరుద్యోగం, నిత్యావసరాలపై జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాపిత ఆందోళనలకు దిగింది. దేశ రాజధానిలో జరిగిన నిరసనలకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేతృత్వం వహించారు. వారిద్దరితో పాటు వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రియాంక గాంధీ ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీస్ బ్యారికేట్లను దాటుకొంటూ, పోలీస్ వలయాన్ని చేధించుకొంటూ, అరెస్ట్ చేయబోతే రోడ్డుపైననే భైఠాయించి చాలాసేపు నాటకీయ దృశ్యాన్ని తలపించారు. పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల నుండి అంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ఊహించని ఢిల్లీ పొలుసులు ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకోవడం కోసం చాల శ్రమ పడవలసి వచ్చింది.
అయితే, అయోధ్యలో రామమందిరంకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన రోజుననే నల్ల దుస్తువులతో కాంగ్రెస్ నేతలు ప్రదర్శనలు చేయడాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్రంగా దుయ్యబట్టారు. రామమందిర నిర్మాణంకు వ్యతిరేకంగా, తమ సంతుష్టీకరణ రాజకీయాలకు పతాక సన్నివేశంగా ఈ ప్రదర్శనలు చేశారని ఆరోపించారు.
రాష్ట్రపతి భవన్ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడానికి యత్నించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. . విజరు చౌక్ వద్ద మార్చ్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరీ, గౌరవ్ గోగయితో సహా 64 మంది పార్టీ ఎంపిలను పోలీస్లు నిర్భంధించి బస్లో తీసుకునివెళ్లారు.
విజరు చౌక్ వద్ద మీడియాతో రాహుల్ మాట్లాడుతూ ‘ధరల పెరుగుదల అంశంపై ఇక్కడ ఆందోళన చేస్తున్నాం’ అని తెలిపారు. అలాగే ‘ప్రజాస్వామ్యం హత్యగావించబడుతోంది’ అని అన్నారు. కాగా, పార్లమెంట్ గేట్ నంబర్ 1 బయట మహిళా ఎంపిలతో కలిసి సోనియాగాంధీ ఆందోళన చేశారు. నిత్యావసరాలపై జిఎస్టిని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.
ఇక, ఎఐసిసి ప్రధానాకార్యాలయం బయట ప్రియాంక వదేరా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే ముందుగానే కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఎఐసిసి ప్రధానాకార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాయలం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
కాంగ్రెస్ కార్యకర్తలను ర్యాలీకి అనుమతించలేదు. దీంతో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి దూకి రోడ్డుపై కూర్చుని ధర్నా చేపట్టారు. అయితే అక్కడ నిషేధం ఉన్నందున ధర్నా చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. అయినా ప్రియాంక ఆందోళనను విరమించకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కించారు.
ఆందోళనల సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ‘ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారు. అందుకే మేం ప్రధాని ఇంటి వరకూ వెళ్లి చూపించాలనుకుంటున్నాం. గ్యాస్ ధర ఎంత పెరిగిందో చెప్పాలనుకున్నాం. అయితే వారు మాపై దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.