వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని, ఈ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంకు అధ్యక్షత వహిస్తూ అన్ని రాష్ట్రాలు పంటల వైవిధ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. సాగు రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు.
శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణను శక్తిగా మలుచుకోవాలని సూచించారు. వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. 2023లో భారత్ జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. దీని ద్వారా వీలయినంత ఎక్కువ లబ్ధి పొందడం కోసం ప్రతి రాష్ట్రం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రతి రాష్ట్రం కూడా తన శక్తి మేరకు తన వంతు పాత్రను నిర్వహించాయని ప్రధాని ప్రశంసించారు. దీనివల్లనే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రోల్మోడల్గా నిలవగలిగిందని ఆయన చెప్పారు.
‘భారత దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఒక చోట చేరి మూడు రోజుల పాటు దేశానికి ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఈ ఉమ్మడి ప్రక్రియ ఈ సమావేశంలో అజెండాను అభివృద్ధి చేయడానికి తోడ్పడింది’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి రాష్ట్రం మూడు ‘టీ’ (ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ)లను ప్రమోట్ చేయాలని ప్రధాని మోడీ అన్నారు. దిగుమతులను తగ్గించడం, ఎగుమతులను పెంచడంపై దృష్టి సారించాలని చెప్పారు. సాధ్యమైన అన్ని చోట్ల స్థానిక వస్తువులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పారు.
జిఎస్టి వసూళ్లను పెంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించాలని, దీనికోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమిష్టి చర్య అవసరం అని చెప్పారు. మన ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇది చాలా కీలకమని ప్రధాని తెలిపారు.
2020లో కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా ప్రత్యక్షంగా జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టెనెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు.
బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.బసవరాజ్ బమ్మైకి రెండు రోజుల క్రితమే కరోనా సోకగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలనే కరోనా నుండి కోలుకున్నారు.