శివసేన ఎంపి సంజయ్ రౌత్కి ముంబయిలోని ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆగస్ట్ 1న అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత ప్రత్యేక కోర్టు ఈ నెల 4 వరకు ఇడి కస్టడీకి అనుమతించగా.. ఆ తర్వాత దాన్ని 8వ తేదీ వరకు పొడగించింది. ఆ కస్టడీ ముగియడంతో మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ముంబయిలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ప్రత్యేక బెడ్డును కేటాయించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జైలు నియమాల ప్రకారం అధికారులు తగిన బెడ్ ఏర్పాటు చేస్తారని కోర్టు స్పష్టం చేసింది.
సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఈ కేసులో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కి కూడా ఇడి సమన్లు జారీ చేసింది. దీంతో గత శనివారం ఆమె దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరయ్యారు.