బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో మారు బిజెపితో తెగతెంపులు చేసుకొని, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుండి వైదొలిగిన ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో సహా ఏడు రాజకీయ పక్షాలు, ఓ స్వతంత్ర ఎమ్యెల్యేతో కలసి కూటమిగా ఏర్పడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
మహా కూటమి ఏర్పాటు చేసిన ఆయన గవర్నర్కు మద్దతు లేఖ అందజేసి, తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం చెప్పడంతో బుధవారం సాయంత్రం 4 గంటలకు తిరిగిర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్తో పాటు ఉపముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేసే అవకాశముంది.
పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ నాశనం చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇదే జరిగిందన్న విషయానికి చరిత్ర సాక్ష్యమని పేర్కొన్నారు. పంజాబ్, మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలను నామరూపాల్లేకుండా చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన విషయాన్ని తేజస్వీ గుర్తు చేశారు. బెదిరించడం లేకపోతే డబ్బుతో కొనేయడం మాత్రమే బీజేపీకి తెలుసన్న ఆయన.. బీహార్ లో వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు.
అంతకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ పాట్నాలోని రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రబ్రీ దేవితో భేటీ అయ్యారు. 2017లో జరిగిన పరిణామాలను మరిచిపోయి కొత్త అధ్యాయం మొదలుపెడదామని నితీశ్ తేజస్వీని కోరినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి రావాలని ప్రతిపాదించగా, తేజస్వీ ఓకే చెప్పడంతో వారిరువురూ కలిసి గవర్నర్ ఫగు చౌహాన్ ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు.
ఆర్జేడీతో కలిసి నితీశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదు. 2015 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అప్పట్లో తేజస్వీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టగా లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రిగా పనిచేశారు. అయితే 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి విజయ సాధించింది. నితీశ్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయనకే సీఎం పదవి అప్పజెప్పారు. మహారాష్ట్ర తరహా పరిణామాలకు బీహార్ లో కూడా బీజేపీ తలపడవచ్చని, తమ పార్టీలో మరో `ఏకనాథ్ షిండే’ కోసం చూస్తున్నారని అనుమానించిన నితీష్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
కాగా, నితీశ్ నమ్మకద్రోహాన్ని బీహార్ ప్రజలు గమనిస్తున్నారని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. మోదీ పేరుతో నెగ్గిన నితీశ్… ప్రజా తీర్పును అవమానించారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో నితీశ్ ప్రజలను కూడా వంచిస్తారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.