తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. లంగాణలో బీసీలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తూ… కేసీఆర్ ‘బీసీ ద్రోహి’ అవతారమెత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడ్తయ్, సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయింది. కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణలో టీఆర్ఎస్ రాజకీయం రోజు రోజుకూ అప్రజాస్వామికంగా తయారవుతున్నదని చెబుతూ సంపదనూ, అధికారాన్ని చేజిక్కించుకున్నవాళ్లు మరింత పొందాలని చూస్తున్నరుగానీ, వాటిని వెనుకబడిన వర్గాలతో పంచుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నరని సంజయ్ ఆరోపించారు. వారు బీసీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులే నామామత్రం కాగా, ఆ కేటాయించే నిధుల్లోనూ కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తాను పంపిన దరఖాస్తులకు అధికారికంగా వచ్చిన సమాధానాలే దానికి చక్కటి నిదర్శనం అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ప్లాన్ తీసుకు వస్తామని కేసీఆర్ మార్చ్, 2017లో చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రకటన చేసి 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు అతీగతీ లేదని విమర్శించారు.
2017లో బీసీ మంత్రులు, బీసీ సామాజికవర్గానికి ప్రజాప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో మూడు రోజుల పాటు సమావేశమై 210 తీర్మానాలను ఆమోదించి వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తే, వాటిల్లో ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని సంజయ్ ప్రశ్నించారు.
2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్ అలంకారప్రాయంగా మారిందని చెబుతూ ప్రతీ బడ్జెట్లో రూ.1000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు డబ్బా కొట్టుకున్న ప్రభుత్వం గత నాలుగుబడ్జెట్లలో రూ.3000 కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగం ఆమోదం పొందింది రూ.350 కోట్లు మాత్రమే అని చెప్పారు. దానిలో ఖర్చు చేసింది రూ.10 కోట్లకు మించి లేదని గుర్తు చేశారు.
వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి కార్పోరేషన్లు ఏర్పాటుచేయగా, ఎనిమిదేండ్లలో 5.70 లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 50 వేల మందికే లోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని సంజయ్ వెల్లడించారు. మిగిలిన 5.20 లక్షల మంది నేటికీ రుణాలు కోసం కళ్లు కాయలు కాసేల ఎదురు చూస్తున్నరని చెప్పారు.