రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ వ్రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), ఎస్హెచ్జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని తెలిపారు.
టీఆర్ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 2021-22 బడ్జెట్లో మహిళాగ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. 2022- 23 బడ్జెట్లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కోటి ఆశలతో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ అసమర్థ విధానాలు, పాలన, మహిళా వ్యతిరేకత కారణంగా తెలంగాణలోని ఆడబిడ్డలు అనేక ఇక్కట్లకు గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళా గ్రూపు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని తెలిపారు.
‘‘కలకంట కన్నీరు ఒలికిన ఏ రాజ్యమూ బాగుపడినట్లు’’ చరిత్రలో లేదని సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో మహిళలు, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల సభ్యుల సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కనీసం ఈ రాఖీపౌర్ణమి సందర్భాంగానైనా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 4 వేల కోట్ల డ్వాక్రా రుణాల బకాయిలను విడుదల చేసి తెలంగాణ ఆడబిడ్డలను, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలను ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు.