తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా ఎంపిక చేసి నియమించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ ధిక్కార ధోరణులు వెల్లడి చేస్తున్నారు.
ఆ పార్టీకి తెలంగాణాలో బలమైన జిల్లాగా భావించే పాత నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఎవ్వరి దారి వారిదిగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి, ఉపఎన్నికల్లో పోటీకి సిద్దపడుతుంటే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలతో నవ్వులపాలవుతున్నది.
రాష్ట్ర నాయకత్వంలో కుమ్ములాటలు తీవ్రతరం అవుతూ ఉండగా, ప్రతి జిల్లాలో- ప్రతి నియోజకవర్గంలో కూడా పరిస్థితులు అంతకన్నా భిన్నంగా లేవు. రేవంత్ రెడ్డి తనకంటూ ఓ వర్గం ఏర్పర్చుకొనే ప్రయత్నం మిన్నగా పార్టీలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.
ఒక వంక మునుగోడు ఉపఎన్నిక వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెహసల్స్ అనుకొంటుండగా, అక్కడ మ్మడిగా పోటీ చేయడం ద్వారా తమ సత్తా చూపే ప్రయత్నం చేయాలనే ఆసక్తి కాంగ్రెస్ నాయకులలో కనబడటం లేదు. తాజాగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కేంద్రంగా అసంతృప్తి సెగలు రాజుకున్నాయి.
చాలామంది నాయకులు ఠాగూర్ తీరును తప్పుపడుతూ గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా పట్టించుకొన్న వారే కనబడటం లేదు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ఒంటరి పోరు జరుపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. పార్టీ పరంగా ఆయన తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాలకు చాలా మంది నేతలు దూరంగా ఉంటున్నారు.
ఇంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీ చూపలేకపోయింది. ఆ సీట్లను అధికార టిఆర్ఎస్ నుండి బీజేపీ గెల్చుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రయత్యామ్న్యాయంగా బిజెపి ఎదిగే ప్రయత్నం చేస్తున్నది. మునుగోడు సీట్ కాంగ్రెస్ కు బలమైనదని చెప్పుకొంటున్నారు. ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేని పక్షంలో తెలంగాణాపై కాంగ్రెస్ ఆశలు వదులుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు.
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ నాయకులదే చాలా తెలీగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గాంధీభవన్ లో మాణిక్కం ఠాగూర్ సమావేశాలకు చాలామంది ముఖ్య నాయకులు గైరాజరు అవుతున్నారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ వ్యూహ ప్రచార కమిటీలో ఉన్న మధుయాష్కీ కూడా హాజరుకాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఇదే కార్యక్రమంలో ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మందలించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు బలోపేతం కోసం పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దానితో, మహేశ్వర్ రెడ్డి నాలుగు పేజీల లేఖ రాశారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ, వారిపై ఫిర్యాదు చేశారు. పార్టీలో జరుగుతున్న అన్ని విషయాల గురించి చెప్పినా ఠాగూర్ తనను అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాణిక్కం ఠాగూర్ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నారు.
‘‘మాణిక్కం ఠాగూర్ చేతిలో రేవంత్రెడ్డి పనిచేస్తున్నట్టు లేదు. ఠాగూరే.. రేవంత్ చేతిలో పని చేస్తున్నట్టు ఉంది. రేవంత్కు ఏజెంట్లా ఠాగూర్ మారినట్లు ఉంది” అని శశిధర్రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ధ్వజమెత్తారు.
అగ్ర నాయకులు అంతర్గత కలహాలతో పార్టీకి నష్టం చేస్తుంటే కిందిస్థాయి నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కొందరు నాయకులు పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడుతుండడం వల్ల, మరికొందరు నాయకులు కాంగ్రెస్ వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తుండడం వల్ల కార్యకర్తల్లో అసంతృప్తి, నిరుత్సాహం పేరుకుపోతోంది. నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను సర్ది చెప్పాల్సిన సీనియర్ నాయకులే.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం ఏంటని చాలామంది కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిట్మెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను సోనియాకు వివరించనున్నారు. అలాగే తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు మీడియాకు వివరించారు.