మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మాత్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే భావన కేసీఆర్ లో కలిగినందువల్లే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోందని తెలిపారు. రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించారని చెబుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని విమర్శించారు.
ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అపోహలను తొలగించిందని డా. లక్ష్మణ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేంద్ర మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడం శోచనీయం అని విచారం వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్ర మంత్రి చెప్పని విషయాలను ఆయనకు ఆపాదించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.
మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎన్నో అబద్దాలాడారని అంటూ అందులో ముఖ్యమైనది సకాలంలో వర్షాలు పడి ధాన్యం దిగుబడి పెరిగితే, తాను నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంట దిగుబడి పెరిగినట్లు చెప్పడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు.