ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజం చెప్పకూడదనే శాపం ఉందని, నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట అని, అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరని, నోరు విప్పితే అబద్దాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికలొస్తున్నయంటే అబద్దాలకు అంతుండదని అంటూ కేసీఆర్ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతదని ధ్వజమెత్తారు.
తన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజు ప్రపంచించి ఆయన తొలుత చాగల్లు గ్రామానికి చేరుకున్నారు. కేసీఆర్ అబద్దాలకు తాజా నిదర్శనం మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని గ్లోబల్స్ ప్రచారం చేయడమని ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న మాట నిజమైతే వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి లేదా లై డిటెక్టర్ టెస్ట్ కు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా అందుకు తాను సిద్ధం అని స్పష్టం చేశారు. కేసీఆర్ తియ్యగా చెప్పే అబద్ధాలు, సామెతలతో వండివార్చే మాయ మాటలు, అహంకారంతో ముడిపెట్టే వెటకారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఒక కామెడీ షోలాగా మాత్రమే చూస్తున్నరని సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాయ మాటలు, అబద్ధాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు.
ఆయన గారడి మాటలన్నింటికీ తెలంగాణ ప్రజల తరఫున సమాధానం చెప్పడానికి, బహిరంగ చర్చకు బిజెపి తెలంగాణ శాఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని బిజెపి తెలంగాణశాఖ నిరూపిస్తుందని స్పష్టం చేశారు. అందుకు తగ్గ ఆధారాలను చూపిస్తామని తెలిపారు.
తాము చూపెట్టే ఆధారాలను చూసినతరువాత తప్పయిందని కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా? అని సంజయ్ సవాల్ చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ మాది తప్పని నిరూపిస్తే బిజెపి తెలంగాణశాఖ దేనికైనా సిద్ధమే? అని స్పష్టం చేస్తూ బిజెపి తెలంగాణ శాఖ సవాల్ కు అంగీకరించాలని కేసీఆర్ ను ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి వస్తే మన బాయికాడ మీటర్లు పెడ్తరని స్పష్టం చేస్తూ రైతులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నరని సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బిజెపి -ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెబుతూ అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు ఆధారాలు కేసీఆర్ చూపించగలరా? అని సవాల్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని భరోసా ఇచ్చారు.
మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ ఫ్యూజు పీకేస్తే, ఫామౌజ్ లో కేసీఆర్ మోటర్ ఆగిపోతదని చెప్పారు. నాలుగొందల ఎకరాల ఫామౌజ్ కు ఎంత కరెంటు వాడుకుంటున్నరు? ఎంత కరెంటు బిల్లు కడుతున్నారో తెలంగాణ ప్రజలకు లెక్క జెప్పే రోజు వస్తదని హెచ్చరించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదుని స్పష్టం చేస్తూ కేంద్రం చేసిన చట్టంలో యాక్ట్ కాపీలో స్పష్టంగా ఉందని తెలిపారు. అయినా గ్లోబల్స్కు వారసుడైన కేసీఆర్ అబద్దాలకు తెగబడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేసీఆర్ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అసలు ఉచిత కరెంట్ ఇయ్యడం కేసీఆర్కు చేతగావడం లేదని విమర్శించారు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రభుత్వం దగ్గర పైసల్లేవని తెలిపారు. జీతాలియ్యడానికే పైసల్లేవ్. ఇగ ఫ్రీ కరెంట్ ఎట్లా ఇచ్చేదని తల పట్టుకుంటున్నరని పేర్కొన్నారు.
మాటకు ముందు, మాటకు వెనక తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నా అంటున్నరు. వానాకాలం సాగుమొదలైనప్పటి నుండి 24 గంటల కరెంటు ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం కరెంటు రాక పోక తెలియక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ తెలిపారు. పవర్కట్లు, లోడ్ప్రాబ్లమ్ అంటూ కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు.
దీనివల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ వీటికి కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. 24 గంటలు ఫ్యాన్లు, లైట్లు వేసుకొని ఇంట్లో కూసూనే పరిస్థితి ఉన్నదా? అని నిలదీశారు. మీరు నెల నెలా ఇస్తున్న కరెంటు బిల్లుల మోత చూసి స్విచ్చులు ఆన్ చేయాలంటేనే తెలంగాణ ప్రజలు వణుకుతున్నరని చెబుతూ కరెంటు చార్జీలు పెంచింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
పైగా కరెంట్ కొనుగోలు పేరుతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల వద్ద రూ 50 వేల కోట్ల అప్పు చేసిన్రని తెలిపారు. ఇప్పుడా అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని గుర్తు చేశారు. డిస్కంలను నమ్ముకుని కరెంట్ సరఫరా చేసిన జనరేటర్స్ (విద్యుత్ ఉత్పత్తి సంస్థలు) బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తెచ్చుకున్నయని, ఆ సంస్థలు కూడా చేతులెత్తేశాయని తెలిపారు. దీనికంతటికీ కారణం కేసీఆరే అని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు దొబ్బడం కోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండని విమర్శించారు. ఫలితంగా ఇయాళ కరెంట్ కొనడానికి కూడా డబ్బుల్లేక రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేయబోతున్నరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఠంచన్గా జీతాలొచ్చేవి. కానీ కేసీఆర్ పుణ్యమా అని వాళ్లకు ఏ రోజు జీతాలొస్తయో తెల్వని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.