నిరంకుశ పోకడలకు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం పతనం కాక తప్పదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ హెచ్చరించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు బిజెపి బెదరబోదని, కేసీఆర్ కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లిక్కర్ స్కాంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయని, దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కవితకే కాదు, ఆమె తండ్రి కేసీఆర్కు ఉన్న సంబంధాలు కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయని చుగ్ జోస్యం చెప్పారు.
కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు బిజెపి వెనుకడుగు వేయబోదని స్పష్టం చేశారు. భయాందోళనలకు గురయ్యే కేసీఆర్, ఆయన సన్నిహితులు రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు.