కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం… తానే హింసకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో, ఈడీ దాడులలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని చర్చ జరుగుతోందని, ఆ చర్చను పక్కదోవ పట్టించేందుకే ఈ కుట్ర చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోందని స్పష్టం చేశారు.
మునావర్ ఫారుఖీ అనే వ్యక్తి సీతమ్మ వారినీ, హిందూ దేవతలని కించపరిచేలా మాట్లాడాడని, అనేక రాష్ట్రాలు అతని షోను నిషేధించాయని గుర్తు చేశారు. సరిగా ఈ సమయంలో ఆ మునావర్ ఫారూఖీ ని రాష్ట్రానికి మళ్లీ ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫారూఖ్ ఆహ్వానంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు.
2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించి మునావర్ ఫారూఖీ షో నిర్వహించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. గత జనవరి లొనే మునావర్ ఫారుఖీ షో ఉంటే హిందు సంఘాలు వ్యతిరేకించడంతో ఆరోజు షో క్యాన్సిల్ అయిందని గుర్తు చేశారు.
అట్లాంటి షో ను మళ్లీ కావాలని హైదరాబాద్ లో పెట్టించడం అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? అని సంజయ్ నిలదీశారు. పాతబస్తీ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోని కేసీఆర్. ఎంఐఎం సహకారంతో అల్లర్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
పాత బస్తీలో ముస్లీమ్ మెధావులు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని, పాత బస్తి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే చాలా మంది ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు.
సరిగ్గా కేసీఆర్ కుటుంబం కేసుల్లో, స్కామ్ లలో ఇరికిందని చర్చ జరుగుతున్న వేళ ఎంఐఎం, టీఆరెస్ కలిసి రాష్ట్రం లో మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా శుక్రవారం నాడు హైదరాబాద్ సహా రాష్ట్రమంతా పెద్ద దారుణమైన కుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానం కలుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా, సంయమనంతో ఉండాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ పోలీసులు రాజాసింగ్ ఇంటివద్దకు చేరుకున్నారు. పోలీసులు రాజాసింగ్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నారని రాజాసింగ్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.